విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని సీఎం జగన్ పరామర్శించారు. విశాఖలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు జగన్ అమరావతి నుంచి వైజాగ్ వెళ్లారు. అయితే తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరుతున్న టైంలో ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఏయిర్పోర్ట్ వెళ్లేందుకు జగన్ కారెక్కారు. ముందు సీటులో జగన్ కూర్చోగా.. వెనక సీట్ లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూర్చున్నారు.
అయితే క్షణాల వ్యవధిలోనే కారు నుంచి విజయసాయి దిగిపోయారు. మంత్రి ఆళ్లనాని వాహనంలోకి ఎక్కారు. వెంటనే వాహనం అక్కడి నుంచి బయల్దేరింది. విజయసాయి కారు నుంచి ఎందుకు దిగారు అనే అంశం హైలైట్ అయింది. విశాఖ పార్టీ వ్యవహారాలన్ని విజయసాయి చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైజాగ్ కు జగన్ తో పాటు వెళ్లేందుకు ఆయన కూడా కారెక్కారు. అయితే ఆ వెంటనే విజయసాయి దిగిపోవడం.. ఆళ్ల నాని కారులోకి ఎక్కడం జరిగింది. ఈ వ్యవహారం ప్రజల ఆరోగ్యానికి సంబధించింది కాబట్టి.. తనతో ఆరోగ్యమంత్రిని జగన్ తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఇక విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన 9 మంది కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఘటనలో గాయపడి, రెండుమూడు రోజులు చికిత్స పొందే వారికి రూ. లక్ష ఇస్తామని చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని అన్నారు. 5 బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. చనిపోయిన పశువుకు రూ. 25 వేల వంతున యజమానికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు.