ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిన జనసేనను బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాన్ నడుం బిగించారు. ఇందుకోసం నాలుగు కమిటీల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ తరుఫున కీలక నేతలు హాజరయ్యారు. కొద్దిరోజులుగా విస్తృతంగా సీనియర్ నాయకులతో చర్చించిన పవన్ ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు.
పవన్ కళ్యాణ్ సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, లోకల్ బాడీ ఎన్నికల కమిటీ.. కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ మానిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
పవన్ కల్యాణ్ వచ్చే 2024 ఎన్నికల్లో జనసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు వర్తమాన రాజకీయాలు, యువత, ఏపీ అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై ప్రధానంగా దృష్టిసారించి భవిష్యత్ లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వ్యూహాలను సిద్ధం చేస్తాయని పవన్ తెలిపారు.
అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ఈ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే జనాలు ఆదరిస్తేనే ఏ పార్టీకైనా మనుగడ.. ప్రజల్లో ఉండి వారి కోసం పోరాడితేనే ఆ పార్టీలకు ఆదరణ.. మరి పొలిటికల్ కమిటీలు వేసి ఊరుకోకుండా క్షేత్రస్థాయిలో పవన్ ప్రజలతో మమేకమవుతూనే వచ్చే ఎన్నికల నాటికి ఆయన పార్టీ బలోపేతం అవుతుంది. ఈ దిశగా ఆలోచిస్తే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.