ఏపీ రాజధాని అమరావతి కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పొలాలు లాక్కునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలని రైతులకు సూచించారు. భూసేకరణ జరిగితే తనకు చెప్పాలని, తాను కూడా వచ్చి మీతో పాటు ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే… ప్రాణాలు ఇవ్వడానికి తానే ముందుంటానని చెప్పారు.
భూసేకరణ పేరిట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కష్టాలు పడుతున్న ఉండవల్లి రైతులను పవన్ ఆదివారం పరామర్శించారు. వారి పొలాలను పరిశీలించారు. అనంతరం పంట పొలాల మధ్యే వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లోకి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని, ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 144 సెక్షన్ అమల్లోనే ఉందని పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
భూసేకరణ జరిగితే తనకు చెప్పాలని, తాను కూడా వచ్చి మీతో పాటు ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే… ప్రాణాలు ఇవ్వడానికి తానే ముందుంటానని చెప్పారు.పంట భూములను బీడు భూములుగా చూపించడం దారుణమని మండిపడ్డారు. అవసరానికి మించి భూములను లాక్కుంటే, ముందుండి జనసేన పోరాడుతుందని అన్నారు. అధికారులను, పోలీసులను వ్యతిరేక భావంతో చూడరాదని… వీరంతా ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేసే వారు మాత్రమేనని చెప్పారు.
మనం ఏమైనా సంఘ విద్రోహ శక్తులమా, ఉగ్రవాదులామా? రైతుల మీద 144 సెక్షన్ ఏంటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల చేపడితే నియంతృత్వ పాలన అవుతుందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే వాళ్లు సర్వ నాశనం అవుతారని పవన్ మండిపడ్డారు. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని, వారి పొలాల్లో ధైర్యంగా తిరగాలని పవన్ సూచించారు. ఉండవల్లి రైతులకు అండగా జనసేన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.