త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో బాబకు చిక్కులు వీడటంలేదు. పార్టీలో టికెట్ల వార్ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వస్తున్న వలస నేతలతో సొంత పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమకు టికెట్ రాదేమోనని అధినేత వద్దకు పరుగులు పెడుతున్నారు. తాజాగా కడప జిల్లా మైదుకూరు టికెట్ పోరు మొదలయ్యింది.
కడప జిల్లాలో జగన్కు చెక్ పెట్టాలని చూస్తున్న చంద్రబాబు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే టికెట్ల కేటాయింపుల దగ్గరే బాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. బుధవారం రాత్రి చంద్రబాబును మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. మైదుకూరు అసెంబ్లీ స్థానాన్ని తనకే కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్ ను మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
డీఎల్కు టికెట్ ఇస్తున్నారాన్న వార్తలతో టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ అప్రమత్త మయ్యారు. మైదకూరులో పోటీచేసేది తానేనని పుట్టా స్పష్టం చేశారు. డీఎల్ రవీంద్రరెడ్డి టీడీపీలోకి వచ్చేది పుకార్లేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వస్తారనేది పుకార్లు మాత్రమేనని ఆయన రారు అని చెప్పుకొచ్చారు.
ఒకడుగు ముందుకేసి శుక్రవారం తన పేరును బాబు ప్రకటిస్తారని పుట్టా సుధాకర్ తెలిపారు.దీంతో డీఎల్ ఆశలు అడియాశలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పుట్టాకు సర్ధి చెప్పి డీఎల్ ను చేర్చుకుందామని బాబు చేసిన ప్లాన్ బెడిసికొట్టినట్టైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని మైదుకూరు టికెట్ను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్న సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.