తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజికవర్గం నేతలు పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ ను విమర్శించే వాళ్లలో ఆది నుంచి వీళ్లే ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. మొదట్లో గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ వంటి కాపు ఎమ్మెల్యేలు జనసేన అధిపతి పై విమర్శలు చేశారు. చిన్న రాజప్పకూడా ఈ జాబితాలోని వ్యక్తే. అయితే పై ముగ్గురి విమర్శలు ఇప్పుడు తగ్గాయి. గంటా శ్రీనివాసరావు జెండా ఎత్తేసేలా ఉన్నాడు. అందుకని పవన్ కల్యాణ్ ను విమర్శించడం లేదు. బోండా కూడా ఇదే రీతిన కామ్ అయిపోయాడు. చిన్నరాజప్ప కూడా అంతే. తనకెందుకన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
అయితే అప్పుడే అయిపోలేదు.. టీడీపీలోని వేరే కాపు లీడర్లు ఇప్పుడు పవన్ కల్యాన్ పై విరుచుకుపడుతున్నారు. ఈ జాబితాలో నిలుస్తున్నాడు బడేటి బుజ్జి. ఇతడు పవన్ కల్యాణ్ కే సవాల్ విసురుతున్నాడు. చేతనైతే తన నియోజకవర్గంలో వచ్చి పవన్ కల్యాణ్ పోటీ చేసుకోవాలని తను ఓడించి తీరతాను అని జనసేన అధిపతికి సవాల్ విసిరాడు బడేటి. ఈయన ఏలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్కడ కాపు ఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. బడేటి బుజ్జి కూడా కాపు సామాజికవర్గం నేతే. ఈ నేపథ్యంలో ఈయన పవన్ కల్యాణ్ కు సవాల్ విసరడం ఆసక్తిదాయకంగా మారింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇలాంటి కిటుకులు ఎన్నో తెలుసు. ఏ పార్టీ వాళ్లను ఆ పార్టీలోని వారిచేతే తిట్టించడం చంద్రబాబు నాయుడి ప్రత్యేకత. జగన్ పై రెడ్డి నేతలను కమ్మిస్తూ ఉంటాడు చంద్రబాబు. జగన్ ను తిట్టడమే పనిగా కొంతమంది రెడ్డి సామాజికవర్గం నేతలకు టీడీపీలో అవకాశాలు, పదవులు దక్కుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ మీదకు కాపు సామాజికవర్గంనేతలను కమ్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్లు కూడా పవన్ కు గట్టి సవాళ్లే చేస్తూ ఉన్నారు. కాపులంతా పవన్ కల్యాణ్ వైపు కాదు సుమా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమీకరణాలు ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేయగలవో చూడాలి.