నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ అన్నట్టు.. మా రాష్ట్ర ఎన్నికల్లో వేలు పెట్టారు కదా.. మీ రాష్ట్ర ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకొని మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం డైలమాలో పడ్డారు. ఇటీవలే ఏపీలో వైఎస్ర్ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకూలంగా ప్రచారం చేయాలని కెసిఆర్ నిర్ణయించారు. అక్కడ తాము ప్రచారం చేస్తామని – తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని ప్రకటించారు. అయితే పరిస్థితి ఇప్పుడు విరుద్ధంగా మారిందనేది పొలిటికల్ సర్కిల్ టాక్.
తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రచారం ప్రజాకూటమికి ఎంత కలిసొచ్చిందో తెలియదు కానీ.. కేసీఆర్కు మాత్రం బాగా కలిసొచ్చింది. మరోసారి సెంటిమెంట్ అస్త్రానికి పదును పెట్టి వదిలితే.. 88 సీట్లు రాలాయి. ఓ రకంగా పరోక్షంగా కేసీఆర్ గెలుపుకు చంద్రబాబు తన వంతు కృషి చేశారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే సీన్ ఏపీలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.
ఏపీలో జగన్కు అనుకూలంగా కేసీఆర్ ప్రచారం చేస్తే దానిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు.. అతని మీడియా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. జగన్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు కేసీఆర్ ఓ బృందాన్ని ఏపీ పంపించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పర్యటించిన వారు నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. జగన్కు మంచి జరగాలంటే ప్రచారానికి దూరంగా ఉండాలనేది ఆ నివేదిక సారాంశం. దీంతో ఏపీలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.