తెలంగాణాలో కాంగ్రెస్కు బిగ్ తగలనుందనె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్రంలో ఉనికికోసం పడరాని పాట్లు పడుతోంది. అయినా కూడా ముఖ్యనేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. తాజాగా కొండా సురేఖ దంపతులు పార్టీని వీడి త్వరలో భాజాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసిన కొండా సురేఖ చల్లా ధర్మారెడ్డిపై ఓటమి పాలయ్యారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండులు సైతం మట్టి కరవడంతో పార్టీ ఉనికి మరింత ప్రశ్నార్థకంగా మారింది. అయితే లోక్సభ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలతో పార్టీ తిరిగి పుంజుకోవడంతో.. టీఆర్ఎస్ను నిలువరించే సత్తా కాంగ్రెస్కే ఉందని ఆ పార్టీ నేతల్లో ధీమా పెరిగింది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల తర్వాత 12మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిపోయారు. మరికొంతమంది బీజేపీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్దుగా ఉన్న కొండా దంపతులు.. బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్ అవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ తమకే ఇవ్వాలన్న షరతుపై వీరు బీజేపీలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.