కర్నూలు జిల్లా రాజీకాయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీలో చేరేందుకు కోట్ల కుటుంబం చేరికపై ఉన్న అనుమానాలు పటా పంచలయ్యాయి. మొదటనుంచి కోట్ల కుటుంబాన్ని కేఈ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీలో కోట్ల చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసిన కోట్ల ఫ్యామిలీ.. పార్టీలో చేరేందుకు కొన్ని షరతులు పెట్టగా… ఈనెల 28వ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించనున్న టీడీపీ భారీ బహిరంగ సభలో కోట్ల ఫ్యామిలీ సైకిలెక్కనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు.
చంద్రబాబుతో భేటీ అయిన కోట్ల తనకు కర్నూలు లోక్సభ సీటు, తన భార్య కోట్ల సుజాతమ్మకు డోన్ లేదా ఆలూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోట్ల కోరినట్టుగా తెలుస్తుండగా… ఇక కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీడీపీ అధినేత అంగీకరించినట్టు సమాచారం.
కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టుబడుతుండటంతో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఆమె డోన్ అసెంబ్లీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ఈ సీటును కేఈ కుటుంబం వదులుకొనే పరిస్థితులు కనిపించడంలేదు. స్తుతం డోన్ అసెంబ్లీ సీటును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ఆశిస్తున్నారు. కోట్ల సుజాతమ్మ డోన్ నుంచి పోటీ చేస్తారా లేక ఆలూరు నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కోట్ల వస్తే ఏర్పడే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే కేఈ సోదరులతో ముందుగానే బాబా మాట్లాడినట్లు సమాచారం.