తెలుగుదేశం పార్టీకి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారు. వైసీపీ తరుపున పోటీ చేసి టీడీపీలోకి ఫిరాయించిన ఎస్వీకి బాబు వెన్నుపోటుకు సొంతగూటికి చేరనున్నారు. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. ఆసమయంలో బాబుకు ఎమ్మెల్యేల సంఖ్య అవసరం ఉండటంతో పార్టీలోకి వలసను ప్రోత్సహించారు. అంతే ఇంకేముంది దాదాపు 23 మంది ఫిరాయించారు. అయితే వారిలో కొందరికి బాబు షాక్ ఇచ్చారు.ఈ ఎన్నికల్లో టికెట్ కేటాయించకుండా మొండిచేయి చూపారు. వారిలో ఎస్వీ మోహన్ రెడ్డి ఒకరు.
ఇప్పుడు పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి కార్యకర్తలతో చర్చలు జరిపిన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కర్నూలు పట్టణాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని… టీజీ ఎంకటేష్ కన్నా తాను చేసిన అభివృద్ధే ఎక్కువని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తనకు టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని… చివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ తమకు ఏనాడు అన్యాయం చేయలేదని మేమె ఆయనకు నమ్మకద్రోహం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యవస్థలో తాను రాజకీయాలు చేయలేనని చెప్పారు. అభివృద్ధి కోసమే మేము టీడీపీలో చేరామన్నారు. తనను, బుట్టా రేణుకను మోసం చేసి బయటకు పంపారని అన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నానని… మళ్లీ వైసీపీలో చేరుతానని చెప్పారు.
టీడీపీలో చేరుతానని తాను ఎవర్నీ అడగలేదని… భూమా నాగిరెడ్డిపై చంద్రబాబు ఒత్తిడి చేసి, తనను టీడీపీలో చేరేలా చేశారని మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలన్నా, కార్యకర్తలను కాపాడుకోవాలన్నా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వైఎస్ జగన్కు బహుమతిగా ఇస్తామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని, తన పోరాటం, సవాల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు.