ఏపీలో ఎన్నికల హాట్ రోజురోజుకు పెరుగుతోంది. మళ్లీ అధికారం చేపట్టాలని టీడీపీ.. ఈ సారి ఎలాగైన ప్రభుత్వాన్ని తామే నడిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు పోటాపోటీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అందుకే రాజకీయ నేతలంతా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆంధ్రా ఆక్టపస్గా పేరున్న లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే రాజకీయాలనుంచి తప్పుకున్నానని ప్రకటించేశారు. కానీ అధికార పార్టీ నేతలతో వరుస భేటీలు చూస్తుంటే పరిస్థితి అలా కనిపించడం లేదు. మరి తిరిగి పోటీ చేయడానికో లేదా ఆయన వ్యాపార సంస్థల విషయంలో స్వలాభం కోసమో తెలీదు కానీ.. ఆయన తరుచుగా ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తున్నారు.
లగడపాటి రాజగోపాల్ ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావుతో రహస్యంగా భేటీ అయ్యారు. గుంటూరు టౌన్ లోని చుట్టుగంట సెంటర్లో ఉన్న హోండా షోరూమ్ లో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. ఈ సారి ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఎలాగూ ఖాళీ లేని నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని లగడపాటి భావిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై వీరిద్ధరి భేటీ జరిగిందని తెలుస్తోంది. కోడెలను డైరెక్ట్గా ఆయన నివాసంలోనూ కలిసే వీలున్నా… బయటి ప్రపంచానికి తెలీకుండా ఉండాలనే ఓ బైక్ షోరూమ్లో కలిసినట్టు తెలుస్తోంది.
మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. కోడెల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారా లేదా అని లగడపాటి సర్వే జరిపారని.. ఈ విషయంపై చర్చించడానికే భేటీ నిర్వహించారని…. దీంతో సత్తెనపల్లిలో పోటీపై లగడపాటి సర్వే చేశారా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి సత్తెనపల్లి లేదా నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.