ప్రజా నాయకుడు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఎక్కడ ఉన్నా.. బ్రహ్మరథమేనని మరోసారి రుజువైంది. వైసీ పీకి చెందిన కీలక నాయకుడు ఉదయిస్తున్న సూర్యుడిగా ప్రజల మధ్యకు వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయులుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజధాని జిల్లా గుంటూరు నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన లావు విషయంలో రాజకీయా లు ఇటీవల దోబూచులాడాయి. ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోవడంతోనే పార్టీ అధినేత జగన్ ఆయనకు గుంటూరు ఎంపీ సీటును ఆఫర్ చేశారు. నాలుగేళ్లుగా ఆయన గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతుగా కష్టపడ్డారు. దీంతో ఆయన ఇక్కడ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోయాడు. జగన్ ఆదేశాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ఆయన ప్రజల్లోకి వెళ్లారు.
ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్న టీడీపీ నాయకుడు గల్లా జయదేవ్ ను ఓడించడమే ధ్యేయంగా లక్ష్యాన్ని నిర్ణయించుకుని లావు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాడు. ముఖ్యంగా ఇక్కడి యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధి విషయంలో సిట్టింగ్ ఎంపీ కూడా చేయలేని విధంగా లావు చాలా సార్లు ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి చూపించారు. అదేసమయంలో స్థానిక సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి బ్లూప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నారు.
అయితే, రాజకీయ సమీకరణల నేపథ్యంలో జగన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు గుంటూరు ఎంపీ సీటు నుంచి పోటీ అని చెప్పిన లావును అనూహ్యంగా నరసరావుపేటకు మార్చేశారు. నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తా నని అక్కడి నుంచి పోటీ చేయాలని సూచించారు. దీని వెనక సామాజిక, రాజకీయ సమీకరణలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు గుంటూరులో కష్టపడి ఇప్పుడు నరసారావుపేటకు మారితే ఎలా అని ముందు ఆయన తటపటాయించినా చివరకు పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల ఉన్న విధేయతతోఆయన నరసరావుపేటలో అడుగు పెట్టారు. అయితే, ఆయనకు ఇక్కడ కూడా ఊహించని విధంగా వైసీపీ శ్రేణుల నుంచి నాయకుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభించింది. లావు.. నరసరావుపేటలో అడుగు పేడుతూనే ఆయనకు నరసారావుపేట లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
లావును గెలిపించుకుని తీరుతామని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నరసారావుపేటలో జరిగిన భారీ ర్యాలీ కనివినీ ఎరుగని రేంజ్లో జరిగింది. ఇక్కడి సమస్యలు, బలంగా ఉన్న అధికార పక్షం నేతల వివరాలను ఆయనకు వివరించారు. అధికార పక్షాన్ని ఓడించే విధంగా పక్కా వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆయన పేరు పేరునా పలకరించి హత్తుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మరింత అండగా నిలిచి విజయానికి బాటలు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువకుడు కావడంతో పాటు నరసారావుపేట లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసీపీకి బలం ఉండడంతో మొత్తానికి పేటలోనూ లావు వైసీపీ నుంచి బలమైన ప్రత్యర్థే అవుతారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.