ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో కత్తితో దాడి గటన తర్వాత డాక్టర్ల సలహా మేరకు జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కోడికత్తి దాడి ఘటనలో కోలుకున్న నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకొని పాదయాత్ర ప్రారంభించనున్నారు. దాడికి ముందు జగన్ విజయనగరంలోని మక్కువ మండలం పాయకపాడు వరకూ పాదయాత్ర చేపట్టారు.
సోమవారం పాయకపాడు నుంచి మొదలుకానున్న ప్రజాసంకల్పయాత్ర, 13వ తేదీన పార్వతీపురం నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గ నేతలు, వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఇదలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ , టీడీపీ పొత్తు నేపథ్యంలో సీనియర్ నేతలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. పొత్తును ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వ్యతి రేకించగా ఎక్కడ తమ సీట్లకు ఎసరు వస్తుందో నిని టీడీపీ నేతలు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడంతో వారం రోజుల క్రితమే సి. రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.
మూడు రోజులుగా వైసీపీ నేతలతో సి. రామచంద్రయ్య చర్చిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్ జగన్ సమక్షంలో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం కడప వచ్చిన ఆయన ఒక వివాహ కార్యక్రమంలో తన సన్నిహితులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరిక ఖాయమైపోయినట్టుగా భావిస్తున్నారు.