విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ సీఎం జగన్ తో ప్రధాని నరేంద్ర ఫోన్ లో మాట్లాడారు. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పూర్తి సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ గ్యాస్లీక్ ఘటనలో బాధితుల్లో చాలా మంది ఆర్ఆర్ వెంకటాపురం వాసులే ఉన్నట్లు మోదీ తెలుసుకున్నారు.
ఇక ఈ ఘటనపై మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన సదుపాయాలపై మోదీకి అధికారులు పలు సూచనలు చేశారు.
ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పరిశ్రమ గతంలో విశాఖ శివారల్లో ఉండేదని.. నగర విస్తరణ తర్వాత ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేయమని ఆదేశించామని, బాధితులను తరలించేందుకు అంబులెన్స్ లు సిద్దంగా ఉన్నాయని చెప్పారు..
గ్యాస్ లీకైన ఘటనపై పరిస్థితులను దగ్గరుండి తెలుసుకునేందుకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖ బయలుదేరారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అలాగే, ఆసుపత్రుల్లో చేరి, చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శిస్తారు.
ఇక హైదరబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో విశాఖపట్నం బయలుదేరే అవకాశం ఉంది. విశాఖ వెళ్లేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు.
కాగా, గ్యాస్ లీక్ జరిగిన ప్రాంతంలో రంగంలోకి దిగిన మునిసిపల్ సిబ్బంది.. ప్రమాద తీవ్రత తగ్గించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఘటనాస్థలికి పరిశ్రమ నిపుణులను అధికారులు రప్పించారు. ప్రభావిత గ్రామాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్ పర్యటిస్తున్నారు.