వైఎస్ఆర్సీపీలోకి ఇప్పటికే టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. మేడా మల్లిఖార్జున రెడ్డి నుంచి ప్రారంభమైన వలసల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటం అధికార పార్టీని తీవ్రంగా కలవర పెడుతోంది. కానీ చూస్తుంటే ఈ తతంగమంతా ఇప్పుడే ముగిసినట్టు కనిపించడం లేదు. వెఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా అప్పుడే సినిమా అయిపోలేదు అన్నట్టు చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఎప్పుడు సైకిల్ దిగిపోయి జగన్ పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కావడం లేదు టీడీపీ నేతలకు.
అయితే నెక్ట్స్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్గా కొనసాగుతోంది. ఈ సారి కోస్తాంధ్ర నుంచి తదుపరి చేరికలు ఉండబోతున్నాయని సమాచారం. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు వైఎస్ఆర్సీపీలో చేరడం గురించి ముందు నుంచే ఊహాగానాలున్నాయి. ఇప్పుడు అవే నిజం కాబోతున్నాయని సమాచారం.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీటు త్యాగం చేయడానికి సిద్ధమైతే మాగుంట చేరడానికి రెడీ అంటున్నారట. ఈ పంచాయితీని జగన్ ఏం తేలుస్తారో చూడాల్సి ఉంది. ఇక మరో పది మంది వరకు వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్లో ఉన్నారట. ఏదేమైనా 15 రోజుల్లో ఈ చేరికలు ముగించి ఎన్నికలపై దృష్టి సారించాలని ప్రతిపక్ష పార్టీ చూస్తుంది.