ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని గొప్పలు చెప్పుకున్న పవన్ తాను స్థాపించిన జనసేన పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయంలో నేను సీఎంను అవుతానని బట్టులు చించుకొని అరిచిన జనసేనుడు చివరకు తన గెలుపుపై కూడా నమ్మకాన్ని కోల్పోతున్నారు. రాజకీయాలంటె సినిమాలో డైలాగులు కొట్టడం అంత ఈసీ అనుకున్న పవన్కు క్షేత్రస్థాయిలో వచ్చే సరికి రాజకీయ పరిస్థితులు అవగతం అవుతున్నాయి. సీఎంగా చెప్పుకోవడంతోపాటు నేతలు, కార్యకర్తల్లో కనీసం గెలుపుపై ధైర్యాన్ని నింపలేకపోతున్నారు. చివరకు తన గెలుపుపై కూడా తనకు నమ్మకంలేదని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల విజయవాడలో జరిగిన జనసేన అభ్యర్థులు సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్దులు మండి పడుతున్నారు. తాము గెలుపును ఆశించి పని చేయలేదని, సీట్లను సాధించాలని ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఎలాగూ ఓటమి తప్పదనే భావనతోనే పవన్ ఇలా మాట్లాడుతూ ఉన్నారని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి గెలుపును ఆశించడం లేదు, సీట్ల లెక్కలు అవసరం లేదు కేవలం ఓట్లు మాత్రమే చాలన్న పవన్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
గెలుపు ముఖ్యం కాదు అనుకుంటే శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో మా చేత ఎందుకు పోటీ చేయించారని తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. పార్టీ స్థాపించినప్పటినుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు జనసేన అభ్యర్థులు ఇతర పార్టీలతో పోలిస్తే తక్కువ గానే ఖర్చు చేసినా… తమ స్థాయికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
పవన్ పర్యటనలు, ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు చేసింది ఎన్నికలలో విజయం సాధించేందుకు కాక మరి ఎందుకు చేశామని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి కొని తెచ్చుకునేందుకు ఇన్ని డబ్బులు ఖర్చు చేయడం అవసరమా…? అని జనసేన అభ్యర్థులు లోలోన మండిపోతున్నారు. ఓడిపోయె దానికి సీఎం అనే ఇంత ఆర్భా టం అవసరమా…అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు మాదంటె మాదేనని చంద్రబాబు, జగన్ పార్టీ శ్రేణులకు చెబుతున్నారని, తమ నాయకుడు అందుకు విరుద్ధంగా జనసేనకు ఓటమి తప్పదు అంటూ వ్యాఖ్యానించడం సరైంది కాదని అంటున్నారు. మార్పు తీసుకు రావడం ముఖ్యం అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి మార్పు తీసుకు వస్తారో చూడాలి.