తెలంగాణా ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీపై పడింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఫైట్ టఫ్గా ఉంటుందనడంలో సందేహంలేదు. ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య భీకర పోరు జరుగుతుందనడంలో సందేహంలేదు. ఇప్పటి నుంచి అన్ని పార్టీలు అభ్యర్తులపై దృష్టి సారించాయి.
తాజాగా ప్రకాశం జిల్లా వైసీపీకీ చెందిన ప్రశాంత్ కిషోర్ సర్వే ఇప్పుడు మాద్యమాల్లో హల్ చల్ చేస్తోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఏడెనిమిది సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకుని వైసీపీ పరిస్థితపై సర్వే చేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్మ, రెడ్డి, దళితుల్లో మాల, మాదిగ, బీసీలు అందులో ప్రధానంగా యాదవ, ముస్లిం మైనారిటీలు, వైశ్య, ఒకట్రెండు చోట్ల మత్స్యకారులు, చేనేతల మనోగతాలకు ఆ నివేదికల్లో ప్రాధాన్యం ఇచ్చారు.
మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గాన్ని పక్కనపెట్టి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సామాజికవర్గాలను ఎంపిక చేసుకున్నారు. మార్కాపురం, గిద్దలూరు వంటి చోట్ల అగ్రవర్ణాల్లో రెడ్డి, కాపు, ముస్లిం మైనారిటీలు, దళితుల్లో మాదిగలు, బీసీల్లో యాదవులకు ప్రాధాన్యం ఇచ్చి వారి నుంచి వైసీపీ, టీడీపీ, జనసేన, ఇతర బలమైన అభ్యర్థుల బలాబలాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.
అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇప్పటికే జగన్ ప్రటించారు. దానికి అనుగునంగానే కమిటీలను కూడా వేశారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ తోపాటు, కొండపి, కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో జగన్ మాట్లాడారని సమాచారం.
అలాగే బాపట్ల లోక్సభ నియోజకవర్గ సమావేశంలో చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు సమన్వయకర్తలను జగన్ ఆహ్వానించారు. వారికి జగన్ సర్వే నివేదికలను అందజేసి లోపాలపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోక పోతే మీ స్థానంలో కొత్త వారు వస్తారని హెచ్చరించినట్లు సమాచారం.