ఏపీలో తెలుగుదేశం పార్టీకి షాక్ల మీద షాక్ల తగులుతున్నాయి. సీనియర్లతో పాటు యువ నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీ వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తుండగానే అవినాశ్ టీడీపీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం విశేషం.
అవినాశ్తో పాటు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీలో చేరిపోయారు. పార్టీలో గుర్తింపు లేకపోవడం, లోకేశ్ వ్యవహారశైలి నచ్చక అవినాశ్ టీడీపీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అవినాశ్, బుచ్చిబాబు కూడా టీడీపీని వదిలిపెట్టడంతో కృష్ణా జిల్లాలో తెలుగు దేశం పార్టీ కోలుకోనివిధంగా నష్టపోయింది. మరికొంత ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకునేందుకు టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.