తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక నానా తంటాలు పడుతోంది. తాజాగా ఆరుగురు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్దంగా ఉన్నారు. ఆ ఆరుగురు శాసనసభ్యులు కూడా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. కొంత మంది శాసనసభ్యులు తమ సెల్ ఫోన్లను స్విచాఫ్ చేయగా, మరికొందరు లిఫ్ట్ చేయడం లేదు.
తెలంగాణాలో ప్రతి పక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ తన వ్యూహాలను అములు పరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొనేందుకు ఆపరేషన్ ఆకర్ష్ను మొదలు పెట్టారు. పార్టీ మారే నేతల్లో చేవెళ్ల చెల్లెమ్మ.. మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెతోపాటు ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, సురేందర్, వీరయ్య, కాంతారావు, ఉపేందర్రెడ్డి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారంట.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతో కారెక్కేందుకు సిద్దంగా ఉన్నారంట. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆకర్షించడదానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించనున్నట్లు తెలిసింది. ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2014 లో టీఆర్ఎస్ తరుపు చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కార్తీక్రెడ్డికి ఆ సీటును ఇచ్చేందుకు గులాబీ బాస్ సిద్దంగా ఉన్నారంట.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఐరోపా పర్యటనను ముగించికుని తిరిగి వచ్చారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి… ఈ ప్రచారాన్ని ఖండించాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి ఫోన్ చేశారని… అయితే వారిలో ఎవరూ ఫోన్లకు స్పందించడం లేదని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.