తన జనసేన పార్టీని విలీనం చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు. అయితే అది ఏ పార్టీ అన్నది బహిరంగంగా వెల్లడించలేదు. అయితే పవన్ చెప్పకపోయినా అది ఖచ్చితంగా బీజేపీనేనన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే పవన్ విలీనం చేయనని ఖరాఖండీగా చెప్పడంతో జనసైనికులు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే గతంలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొని మోడీ సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు కూడా పవన్ కు ప్రధాని మోడీనుంచి ఇదే ఆఫర్ వచ్చిందట.. పవన్ కూడా దీన్ని ధృవీకరించారు. అప్పుడే ఒప్పుకొని ఉంటే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.
తాను పార్టీని నడిపితీరుతానని పవన్ స్పష్టం చేశారు. తన పార్టీ టీఆర్ఎస్ లాగా ప్రాంతీయ తత్వాన్ని నమ్ముకోలేదని.. తెలుగును ఎజెండాగా టీడీపీలో లాగా పాకులాడదని.. తండ్రి బలంతో వైసీపీలాగా రాజకీయాలు చేయనని పవన్ పార్టీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం స్థాపించబడిందని పవన్ అన్నారు.
రాష్ట్రంలోని పార్టీలలాగా వీధి తగాదాలు చేయడానికి.. సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు చేయడానికి తాము కాంగ్రెస్, టీడీపీలం కాదని పవన్ ఎద్దేవా చేశారు. తమ బలాలు, బలహీనతలు తెలుసునని పవన్ చెప్పాడు. రాజకీయాల్లో ఓటమి నుంచి గెలుపునకు ఎలా వెళ్లాలో నేర్చుకొని పార్టీని డబ్బు లేకున్నా నిలబెడుతానని పవన్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి పవన్ ఒంటరిగానే రాజకీయాలు చేయడానికి రెడీ అయినట్లు కనిపిస్తోంది.