అనంతపురం జిల్లాలో టీడీపీకీ మరో షాక్ తగిలింది. మడక శిర ఎమ్మెల్యే మసాల ఈరన్నకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ నేత ఈరన్న దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఎన్నికకు వ్యతిరేకంగా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న ఈరన్న వినతిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వీరన్న.. వైఎస్సార్సీపీ నుంచి డాక్టర్ తిప్పేస్వామి పోటీ చేశారు. కాని తిప్పేస్వామిపై 14వేలపై చిలుకు ఓట్లతో గెలిచారు. అయితే ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో.. తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసులు.. తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు.
తిప్పేస్వామి పిటిషన్ను విచారించిన హైకోర్టు.. ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు పై అప్పట్లోనే టిడిపి నేతలు తాము ఈ తీర్పు పై సుప్రీం కు వెళ్తామని చెప్పారు.హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఈరన్న సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పును పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈరన్న పిటిషన్ను కొట్టివేసింది. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామే ఎమ్మెల్యే గా కొనసాగుతారని ధర్మాసనం స్పష్టం చేసింది.
టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మడకశిరలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించాయి. కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులు ర్యాలీగా వెళ్లి మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు