అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన బంట్రోతు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా బంట్రోతు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సినీనటుడు బాలకృష్ణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను బంట్రోతు అనడం సరికాదని… ప్రజల విషయంలో ఎవరైనా సరే బంట్రోతులే అన్నారు. ప్రజల సేవ విషయంలో మేం బంట్రోతులమే కానీ.. వైసీపీ వాళ్లు అనుకున్నట్లు కాదని చురకలంటించారు. వైసీపీ ఎమ్మోల్యేలు ఎవరికి బంట్రోతులో వారికే తెలుసంటు బాలయ్య వ్యంగ్యస్త్రాలు సంధించారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎవరైనా సరే బంట్రోతుల్లాగే మారి ప్రజలకు సేవ చేయాలన్నారు. మరోవైపు గవర్నర్ ప్రసంగంపై కూడా స్పందించారు బాలకృష్ణ. గవర్నర్ ప్రసంగంలో అమరావతి ప్రస్తావన ఎక్కడా రాలేదని విమర్శించారు. చేతి వృత్తుల వారికి ఏం చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. జలయజ్ఞం తరహాలో నీటి ప్రాజెక్టుల ప్రస్తావన ఉందని గవర్నర్ అన్నారు.గవర్నర్ ప్రసంగం నవరత్నాలకే పరిమితమైందని అవహేళన చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరమని అన్నారు.