టీడీపీ సీనియర్ నేత, ఎంపీ అశోక్ గజపతి రాజు పార్టీ అధినేత చంద్రబాబుపై అలిగారా? లేక వేరే పార్టీ వైపు చూస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇలా అనుమానాలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.. కానీ బయటికి కనిపించేవి రెండు.
మొదటిది.. ఇటీవల గజపతిరాజు గారి సొంత ఇలాఖాలో నిర్వహించిన భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన సభకు అశోక్ గజపతిరాజు హాజరుకాలేదు.
రెండు.. చాలా సంవత్సరాల తర్వాత నిర్వహించిన టీడీపీ పోలిట్బ్యూరో సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు.
వినిపించే కారణమేమంటే.. టీడీపీలో కొన్ని రోజుల నుంచి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అశోక్ గజపతిరాజు పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్ల పాటు పనిచేసిన అరకు మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతానని వార్తలు రావడంతో అశోక్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్లు తెలిసింది. అసలు ఢిల్లీలో కిశోర్ చంద్రదేవ్తో సమావేశమైన విషయాన్ని చంద్రబాబు తనతో చర్చించకపోవడంపై అశోక్ గజపతిరాజు మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది.
విలువల కంటే కాలుక్యేషన్స్కే ఎక్కువ ప్రాధన్యామిచ్చే చంద్రబాబు వైఖరి అశోక్ గజపతి రాజుకు ముందే తెలుసు. కానీ విషయం ఎప్పుడు తన దాక రాలేదు కాబట్టి కొత్తగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా అశోక్ గజపతి అలక పాన్పు దిగుతారా? లేదా టీడీపీని వీడే జాబితాలో చేరుతారా.? అన్న విషయం త్వరలోనే క్లారిటీ రానుంది.