ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని… ముస్లిం ఓటర్లు దూరమవుతారనే భయంతోనే అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని కుయుక్తులు పన్నుతున్నారని జేసీ తెలిపారు.
మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్తో పొత్తుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతును కోరుతోందనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇవ్వడంలో తప్పు లేదని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో మాత్రం పొత్తు ఏమాత్రం మంచిది కాదన్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదని చెప్పారు. కాంగ్రెస్ – టీడీపీ పొత్తు తెలంగాణ వరకే పరిమితం అన్నారు. ఏపీలో ఆ అవసరం లేదని చెప్పారు.
నవ్యాంధ్రను దెబ్బతీయడంలో అందరి పాత్ర ఉందని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన పాపం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదే అన్నారు. ఏపీకీ ఎన్డీఏ ఏదో చేస్తారని నాలుగు సంవత్సరాలుగా పెట్టుకున్న ఆశలపై నీల్లు చల్లారని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్ ను నమ్మి చూస్తే తప్పేముందని జేసీ ప్రశ్నించారు. పొత్తులకు సంబంధించి ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని చెప్పారు.