ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసన తెలియజేశారు. గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలు ప్లకార్డులతో ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇక పలు రకాల వేషధారణలతో నిత్యం వార్తల్లో ఉండే చిత్తూరు ఎంపీ, సినీనటుడు శివప్రసాద్ గురువారం పార్లమెంట్ ముందు మరో వేషధారణతో హల్చల్ చేశారు.
గారడీ వాడి వేషధారణతో పార్లమెంటు ముందు ఆందోళకు దిగారు. విభజన హామీలు నెరవేర్చకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న మోసానికి నిరసనగా టీడీపీ ఎంపీలు రెండు రోజులుగా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేస్తున్నారు.
పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు ఒకరైతే.. మోదీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేస్తారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్ ఫైరయ్యారు. ఎన్నికల వేళ అవీ, ఇవీ ఇస్తామని చెప్పి తెలుగు ప్రజల ఓట్లు గుంజుకున్న మోదీ ఆ తర్వాత రిక్త హస్తం చూపించారని ఆరోపించారు. మాయమాటలతో గారడీ వాడిని మించి పోయారని విరుచుకుపడ్డారు.