దేశంలో భాజాపా, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేటీఆర్, జగన్ల భేటీ ఏపీ రాజకీయాల్లో హీట్ను పెంచుతున్నాయి. పేరుకు వైసీపీని ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించేందుకే ఆయనను కలిశామని టీఆర్ఎస్ చెబుతున్నా… ఈ భేటీ వెనుక అసలు లక్ష్యం టార్గెట్ చంద్రబాబు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని పార్టీల అధినేతను స్వయంగా కలిసిన టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరి జగన్ని మాత్రం కలవకుండా తన కుమారుడిని ఎందుకు పంపించాడని ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి తెరదించారు కేటీఆర్.
కేసీఆర్ విజయవాడ వెళ్లి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కేసీఆర్ విజయవాడ వెళ్లడమంటే… ఆయన దాదాపుగా ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా వేలు పెట్టడమే అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అమరావతిలో జగన్ను కలిసి ఫెడరల్ ఫ్రంట్పై మాట్లాడతారని కేటీఆర్ తెలిపారు. దీంతో ఇద్దరు నేతల భేటీ ఎప్పుడు జరుగుతుంది.. ఎక్కడ జరుగుతుంది అంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది.
జగన్, కేసీఆర్ల భేటీకి డేట్, టైమ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తాను నిర్మించుకున్న ఇంట్లో ఫిబ్రవరి 14న గృహ ప్రవేశ ముహూర్తాన్ని నిశ్చయించుకున్న జగన్ .. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎంను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్రంట్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలను కూడా చెబుతారని ప్రచారం జరుగుతుంది. మరి ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.