కరోనా ప్రమాదం ఇతర దేశాల్లో తీవ్రంగా ఉండటంతో.. ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు.
ఎవరింటికి వారు పరిమితం కావాలని.. ఇవాళ జనతా కర్ప్యూ సందర్భంగా ప్రదర్శించిన స్పూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అత్యావసర వస్తువుల కోసం కుటుంబానికి ఒక్కరిని మాత్రమే బయట అనుమతిస్తారని వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్టుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని హితవు పలికారు.
రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్నిరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డుదారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు.