తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగుతున్నా అక్కడక్కడా ఘర్శణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కల్వకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది.
నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశిలించడానికి అమనగల్ మండలం జంగారెడ్డి పల్లి గ్రామానికి వెళ్లిన వంశీచంద్ రెడ్డిని బిజెపి నాయకులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా భాజాపా కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంతో అయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వంశీచంద్ను ఆమన్గల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ల సలహాతో 108లో వంశీచంద్ను నిమ్స్కు తరలించారు.
గ్రామంలోని ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లి వంశీచంద్ ప్రచారం చేస్తున్నాడంటూ బిజెపి కార్యకర్తలు ఆరోపిస్తూ అతన్ని అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్,, బిజెపి నాయకుల మధ్య తోపులాట జరిగడంతో వంశీచంద్ రెడ్డి కిందపడిపోయారు. ఆయన కారుపై కూడా కొందరు రాళ్లు విసరడంతో ద్వంసమైపోయింది.
ఈ దాడిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి స్పందించారు. ఈ దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎష్ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఓటింగ్ సరళి చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాకూటమి విజయం స్పష్టంగా కనిపిస్తోందని, ఇలాంటి దాడులకు కాంగ్రెస్ భయపడదని అన్నారు.