తెలంగాణా భాజాపా ఒక్క సీటు గెలుపుతో తన పరువు నిలుపుకుంది. ఫలితాలు వెల్లడి కాకముంది కింగ్ మేకర్ అవుతమని భావించిన కమళానికి తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. 2014 లో ఐదు సీట్లు గెలిచిన భాజాపా ఇప్పుడు ఆఫిగర్ 1కి పడిపోయింది. పరిపూర్ణానంద స్వామిని బరిలోకి దింపినా భాజాపా తలరాత మారలేదు.
అదనంగా సీట్లు గెలవకపోగా..4 సిట్టింగ్ స్థానాలు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ (ముషీరాబాద్), కిషన్ రెడ్డి (అంబర్ పేట్), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(ఉప్పల్), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్) ఓటమి పాలయ్యారు. ఈ సారి ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కరు గెలిచారు. గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్..కమలదళం పరువు కాపాడారు. సమీప ప్రత్యర్థి ప్రేమ్సింగ్ రాథోడ్పై ఆయన విజయం సాధించారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 118 స్థానాల్లో బరిలోకి దిగింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి అగ్రనేతలతో పాటు స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేసినప్పటికీ బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. టీఆర్ఎస్కు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.