టీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అసంతృప్తి మెల్ల మెల్లగా బయటపడుతోంది. నిన్న ఈటల, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లు తమ మనసులోని అసంతృప్తిని వెల్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ కోవలో ఇప్పుడు మాజీ హోమంత్రి నాయిని నరశింహారెడ్డి చేరారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని నాయిని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే నాయిని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను. కానీ కేసీఆర్, వద్దు కౌన్సిల్లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నాడని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని పేర్కొన్నారన్నారు.మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడేమో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానంటున్నారని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చైర్మన్ పదవి వద్దని.. అందులో రసం లేదంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి తాను కూడా ఓనర్ నే నని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదని అన్నారు. భవిష్యత్తులో ఇంకెంత మంది అసంతృప్తులు బయటకు వస్తారో చూడాలి.