తెలంగాణా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్తో ఎక్కువగా టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్గా చేసుకొని విమర్శల పర్వం కొనసాగుతోంది. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబుపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే తాజాగా తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాకుత్పురా నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నాయిని మాట్లాడుతూ…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, అది ఎవరితరం కాదని అన్నారు.
ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేది వైఎస్ జగనేనని జోష్యం చెప్పారు. చంద్రబాబు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని, ఎన్నికల తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిరునామా కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలతో టీఆర్ఎస్ ను పోల్చి చూస్తే, ఎవరు బాగా పాలించారో తెలుస్తుందని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయిని గుర్తు చేశారు.