మహాకూటమిపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ విమర్శలు చేశారు. ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. వడ్డీలు కూడా కట్టలేదని ఆరోపించారు.
ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో హామీలు అమలు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ వారం రోజులు ‘ప్రజావంచన వారం’ పేరుతో నిరసన దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. జన్మనిచ్చిన కాంగ్రెస్ను కాదని.. తెదేపాలో చేరిన చంద్రబాబు తర్వాత మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఎవరికీ తెలియనిది కాదన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటుదారుడు అన్న బిరుదే ఉందన్నారు.
నాటి మేనిఫెస్టోలను అమలు చేయని ఈ రెండు పార్టీలు ముందు జనాలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇది ప్రజా కూటమి కాదని… దగా కూటమని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు అమరావతికి పారిపోయిన సంగతి నిజం కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు.
అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడుతున్న చంద్రబాబు తెలంగాణ ప్రజలను ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని హరీశ్రావు ప్రశ్నించారు. విశ్వసనీయ లేని చంద్రబాబుకు, విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటమి తప్పదని హరీశ్ అన్నారు. తెలంగాణపై చంద్రబాబుకు ప్రేమే ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు ఎందుకు రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు.