పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓడిపోతే తాను గాంధీభవన్ ముఖం కూడా చూడనని శపథం చేశారు. కూటమి గెలుపు, ఓటమికి పూర్తి బాధ్యత అంతా తనదే నన్నారు. తాము ఓడిపోతే గాంధీ భవన్ బాధ్యతలను ఉపాధ్యక్షుడు కుమార్ రావు చూసుకుంటారని అన్నారు.
ఒకవేళ ప్రజాఫ్రంట్ ఓడిపోతే డిసెంబర్11 తర్వాత తాను గాంధీభవన్ లో అడుగుపెట్టేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాఫ్రంట్ గెలిచి తీరుతుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై మంద కృష్ణ మాదిగ, కుంతియాలతో కలసి చర్చించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే, అది కేసీఆర్ మాత్రమేనని, రాష్ట్రం వస్తే, దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన ఆయన, మోసం చేశారని ఆరోపించారు. 2009లో ఎంఆర్పీఎస్ అండతోనే ఆమరణ దీక్ష చేసిన కేసీఆర్, ఆపై ఎస్సీ వర్గీకరణను అటకెక్కించారని నిప్పులు చెరిగారు.
ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలక ప్రకటన కూడా చేశారు. ముందస్తు ఎన్నికల్లో గెలిచే వరకు తాను గెడ్డం తీసేది లేదని ప్రతిన బూనారు. ఈ నేపథ్యంలో ఆయను గెడ్డం తియ్యకుండా ఉన్నారు. డిసెంబర్ 11 తర్వాత ప్రజాఫ్రంట్ విజయంతోనే గెడ్డం గీస్తానని శపథం చేశారు.