తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళా సచివాలయం కూల్చివేత విషయం అందరిలో ఎంతో ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్ష నేతలు ఇప్పటికే కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తుండగా మరోవైపు పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే పాత సచివాలయాన్ని కూల్చివేయగా, నిర్మాణ వ్యర్థాలను కూడా తరలించేశారు. మరోవైపు ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి పరిపాలన అనుమతులు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా వచ్చేసింది.
అయితే… 400కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణం ఉంటుందని ముందుగా అంచనా వేయటంతో పాటు టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ కూడా చర్యలు ప్రారంభించింది. సీఎం కేసీఆర్ వరుస సమీక్షలతో కొత్త భవనాల నమునాలను ఫైనల్ చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన సూచనలు, మార్పుల తర్వాత కొత్త సచివాలయ నిర్మాణంతో పాటు నిర్మాణ వ్యర్థాల ఖర్చు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం ఖర్చు దాదాపు 700కోట్లకు చేరుకుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. కేవలం వ్యర్థాలు తరలించే లోపే 400కోట్లు ఉన్న అంచనా వ్యయం 700కోట్లు అయ్యింది.
నిర్మాణం మొదలై, నిర్మాణాలు పూర్తయ్యే సరికి ఈ అంచనాలు 1200కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. ప్రస్తుతం కేటాయించిన 700కోట్ల నిధులు కేవలం నిర్మాణాలకే అని, 25ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ సచివాలయం నిర్మాణంలో భారీగా పార్కులు, హెలిప్యాడ్, ఇన్నర్ రోడ్స్ కు నిధులు అదనంగా కేటాయించాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇక మొత్తం బడ్జెట్ లో కేవలం ఇంటీరియర్ వర్క్స్ కే 30శాతం నిధులు ఖర్చు చేయనున్నారు. సీఎం కేసీఆర్ కోసం రెడీ చేస్తున్న బుల్లెట్ ప్రూఫ్ ఫ్లోర్ కు 60కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఫర్నీచర్ కోసం 7 ఫ్లోర్లలో కనీసం 50కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేయాల్సిందేనని అధికార వర్గాలంటున్నాయి.