ఏపీలో 3 రాజధానుల ప్రకటన కాక రేపుతోంది. తాజాగా మరో విభజనకు దారితీస్తుందా అన్న సందేహాలకు తావిస్తోంది. రాయలసీమకు చెందిన సీనియర్ టీడీపీ నేత టీజీ వెంకటేశ్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ ఇలా మూడు రాజధానులను విభజిస్తూ ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఏపీ విభజన తప్పదని ఆయన హెచ్చరించారు.
మంత్రులు ఒక చోట.. సీఎం మరోచోట.. ఉండడం ఎవ్వరికీ మంచిది కాదని టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నా మినీ సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు.అమరావతి, కర్నూలులో కూడా మినీ సచివాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
మూడు ప్రాంతాలను అభివృద్ది చేయడం మంచిదే అయినా భవిష్యత్తులో మాత్రం ఇది వివక్షకు దారి తీసి ఏపీ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని టీజీ వెంకటేశ్ హెచ్చరించారు. విశాఖ అభివృద్ధి చెందిందని అమరావతి, కర్నూలును జగన్ అభివృద్ధి చేయాలని టీజీ వెంకటేశ్ సూచించారు.