వైఎస్ జగన్ ఒక మహాసంకల్పంతో చేపట్టిన పాదయాత్ర విజయవంతం అయ్యింది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలను, వారి బాధలను తెలుసుకున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడ్తామో వివరించారు. 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాయదాత్ర సాగించారు. పాదయాత్ర ఇచ్చాపురంలో నిర్వహించే బహిరంగ సభతో ముగియనుంది.
ఎన్నికల సమయం కావడంతో పార్టీకీ సినీ గ్లామర్ పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి పలువురు నటులు వైసీపీ తీర్థం పుచ్చుకుని జగన్ వెంట నడుస్తున్నారు. తెర వెనుక కూడా సినీ నటులు జగన్కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు భానుచందర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇచ్చాపురంలో ముగియనుంది. ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఇచ్చాపురం చేరుకున్న భానుచందర్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా కప్పి భానుచందర్ ను పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.
ఏడాది కాలంగా జగన్ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేయడం గర్వించతగ్గ విషయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ, పృథ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, సినీనటుడు కృష్ణుడు, జబర్దస్త్ టీం కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.