జగన్తో కేటీఆర్ భేటీ కావడ రాజకీయా వర్గాల్లో సంచలనం రేపుతోంది. కేంద్రంలో బీజేపీని ఓడించి, కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ అధినేతలతో చర్చలు జరిపారు. దానిలో భాగంగానే జగన్తో కేటీఆర్ భేటీ అవుతున్నట్లు సమాచారం.
ఫెడరల్ ఫ్రంట్లో కలిసివచ్చే విషయంపై ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీతో కూడా చర్చించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం (జనవరి 16) వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కానున్నారు.
అయితే వీరి భేటీపై రాజకీయ కారణాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీని ఒంటరిని చేశామని భావిస్తున్న వైసీపీ… టీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. అందులోనూ కేసీఆర్ బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. రాజకీయ కోణాలు ఎన్ని ఉన్నా వీరి భేటీ ఇప్పుడు అందర్నీ ఆకర్శిస్తోంది.