విజయవాడ సెంట్రల్ సీటు తనకు కాదని వేరే వాళ్లకు కేటాయించడంతో గుర్రు మీద ఉన్నారు వంగావీటి రాధా. ఓ దశలో ఆయన పార్టీ మారతారని కూడా పుకార్లు వచ్చాయి. రాధా అభిమానులు కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. కాని పార్టీ మారితే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిని రాధా సైలెంట్గా ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాత్రి వంగవీటి రాధాను కలిశారు. చాలాసేపు రాధాతో ఏకాంతంగా విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారు. గత 2014 ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దాంతో రాధాను విజయవాడ సెంట్రల్ సీటుపై దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ ఆదేశించింది.
అయితే ఇటీవలే మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లాది విష్ణుకి విజయవాడ సెంట్రల్ సీటుపై మంచి పట్టు ఉంది. దీంతో వంగావీటి రాధాని తప్పించి మల్లాది విష్ణుని నియోజకవర్గ ఇంచార్జ్గా నియమించారు జగన్. పైగా వంగావీటి రాధాకి మల్లాది విష్ణుకి మధ్య మొదటి నుంచి అభిప్రాయభేదాలు ఉన్నాయి. దీంతో అలిగిన వంగవీటి రాధా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో రాధా తమ్ముడు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ జనసేన పార్టీలో చేరడంతో ,రాధా కూడా జనసేనలో చేరతారని అందరు భావించారు. కాని వైసీపీ అధిష్టానం రాధాను పార్టీలోనే కొనసాగేలా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే విజయసాయిరెడ్డి రాధాను కలిశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాధాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నాడు. కాని రాధా మాత్రం తను విజయవాడ సెంట్రల్ సీటుపై పోటీ చేస్తానని పట్టుపడుతున్నాడని తెలుస్తుంది. అయితే జగన్ చేయించిన సర్వేలో రాధాకు విజయవాడ సెంట్రల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని తేలడంతోనే ఆయనను ఎంపీగా పోటీ చేయలని జగన్ కోరుతున్నారట. ప్రస్తుతనికి అయితే వంగవీటి రాధా పార్టీ మారే అవకాశం అయితే కనిపించడం లేదు.