అనంతపురంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఎన్నికలు ఆరు నెలలముందు మూడు నెల్ల సినిమా చూపిస్తారని సెటైర్స్ వేశారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు చేయని డ్రామా, చూపించని సినిమా ఉండదని విమర్శించారు. ఎన్నికల సమయంలో వైసీపీ పథకాలను సరిగా కాపీకొట్టడం కూడా సరికాదన్నారు.
ఎన్నికల సమయంలో ఓటుకురూ.3000 కూడా ఇచ్చేందుకు బాబు సిద్దంగా ఉన్నారని..అయితే మీరు మాత్రం రూ.5000 కావాలని డిమాండ్ చేయండన్నారు. కాని ఓటు వేసె ముందు మాత్రం భగవంతుడిని తలచుకుని ఓటెయ్యాలని కోరారు. ఏ భగవంతుడు అవినీతి సొమ్మును తీసుకుని ఓటెయ్యమని చెప్పడని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు బాబు ఇలాంటి జిమ్మిక్కులు, వెయ్యని డ్రామాలు, చెప్పని అబద్దాలు ఉండవన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అనంతపురం జిల్లా వాసులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఏపీలో 1,250 మంది వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ దొంగ కేసులన్నీ ఎత్తివేస్తామన్నారు. నీతివంత మైన పాలన అందిస్తామని…తాము కులం, మతం, ప్రాంతం, పార్టీల ఆధారంగా వివక్ష చూపబోమని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని జగన్ అన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీనీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తల భుజస్కందాలపై ఉందన్నారు.