దుమ్ములేచిందని ముక్కు మూసుకుని వెళ్ళిపోయి బెంజ్ కార్లో తిరుగు ప్రయాణమయ్యే నాయకుడిని నేను కాదని జగన్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. కోట్లాది మంది ప్రజలు ఓట్లేసి తనను ప్రతిపక్ష నాయకుడిగా గెలిపించినందుకు అనుక్షణం వాళ్ళ మధ్యనే ఉంటూ ఉన్నాడు. ఎండా, వాన, చలి అన్న భేదాలే లేవు. ఎప్పుడూ ప్రజల వెంటే…..ప్రజలతోనే. అయితే వైకాపా నాయకులు మాత్రం జగన్ శైలిని అందిపుచ్చుకోలేకపోయారు. జగన్ కష్టంతో అధికారంలోకి వచ్చేస్తాం అనే తరహాలో వ్యవహరించారు. కానీ ఆ పార్టీలో ఉన్న కొంతమంది అయినా ఇప్పుడిప్పుడే వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ల తరహాలో ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటున్నారు.
తాజాగా వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఏకంగా పూర్తిగా మురుగుతో నిండిపోయిన ఒక మురుగునీటి చెరువులోకి దిగి తన నిరసన తెలియచేశాడు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు అలాంటి మురుగుతో నానా కష్టాలు పడుతూ ఉంటే, అనారోగ్య సమస్యలకు గురవుతుంటే ప్రజా ప్రతినిధిగా మౌనంగా ఎలా ఉండగలనని ఎన్ని అర్జీలు పెట్టినా, ఎన్ని సార్లు ప్రభుత్వ ఆఫీస్లు చుట్టూ తిరిగినా పనవ్వక చంద్రబాబుకు తెలిసొచ్చేదాని కోసం ఇలా చేయాల్సి వచ్చిందని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏకంగా మురుగుతో నిండిన చెరువులో ……ముక్కుపుటాలు అధరగొడుతున్న ఆ మురికివాసనను భరిస్తూ ఆ ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియచేయడం కోసం కోటంరెడ్డి చేసిన ప్రయత్నానికి మాత్రం సర్వత్రా ప్రశంశలు దక్కుతున్నాయి. స్వయంగా వైఎస్ జగన్ కూడా కోటంరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అందరం కూడా ఇలాగే కష్టపడితే రేపు ఏ నాయకుడు ఏ స్థాయిలో డబ్బులు పంచినా, ఎన్ని దొంగ ప్రచారాలు, అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు మాత్రం కచ్చితంగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని తనకు నమ్మకం ఉందని వైకాపా నాయకులతో చెప్పాడు జగన్. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిలాగే ఇతర వైకాపా నాయకులు కూడా ప్రజల కోసం అనుక్షణం పాటుపడితే 2019ఎన్నికల్లో వైకాపా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నది మాత్రం కచ్చితం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.