ఎన్నికల ఫలితాలపై ధీమాగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇన్నాల్లు అధికారపార్టీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఆయన త్వరలో హైదరాబాద్కు గుడ్బాయ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఇక రాజకీయాలన్ని అమరావతిని కేంద్రంగా చేసుకుని నడపనున్నారు.
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో వైఎస్ జగన్ కొత్తగా ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇందులోనే కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన అక్కడి నుంచే పూర్తిస్థాయిలో రాజకీయాల కార్యకలాపాలను కొనసాగించడానికి సిద్దమవుతున్నారు. ఫిబ్రవరిలో తాడేపల్లిలో గృహప్రవేశం చేశారు కూడా. గృహప్రవేశం చేసిన రోజు రాత్రే ఆయన హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసానికి వచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ నివాస స్థలాన్ని టార్గెట్ చేసుకొని చంద్రబాబు జగన్పై విమర్శలు గుప్పించారు. పొద్దున ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తాడు..సాయంత్రం కాగానే లోటస్ పాండ్కు వెళ్లిపోతాడంటూ ఆరోపించారు. లోటస్పాండ్ ఇంటి నుంచి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారంటూ ఇష్టానుసారంగా చంద్రబాబు విమర్శలు చేశారు.
విర్శలన్నింటికి చెక్ పెట్టేలా- ఇక పూర్తిస్థాయిలో తాడేపల్లి నుంచే తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జగన్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. దీనిలో భాగంగానె హైదరాబాదులోని లోటస్ పాండులో గల పార్టీ సామగ్రిని అమరావతికి తరలించడం ప్రారంభమైంది.
ఈ నెల 21వ తేదీ నుంచి వైసిపి కేంద్ర కార్యాలయం అమరావతి నుంచే కార్యకలాపాలు నిర్వహించనుంది. జగన్ మాత్రం 22వ తేదీన ఉండవల్లి వెళ్తారు. ఆయన 22వ తేదీన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు లేదా మరుసటి రోజు వైఎస్ జగన్.. శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి భేటీని తాడేపల్లి నివాసంలో మొదటి వైసీపీఎల్పీ భేటీని నిర్వహించనున్నారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం- తాడేపల్లి నివాసాన్ని అధికారిక నివాసంగా మార్పు చేయవచ్చని చెబుతున్నారు. క్యాంప్ కార్యాలయంగా మార్పులు చేర్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ ప్రజలను కలుసుకోవడానికి వీలుగా- తాడేపల్లి నివాస ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయవచ్చని తెలుస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు.