ఇడుపుల పాయలో పార్టీ తరుపున పోటీ చేస్తున్నా అసెంబ్లీ, లోక్సభ అభ్యర్ధులను ప్రకటించిన వెంటనే జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలు ఎక్కు వ రోజులు లేకపోవడంతో సుడిగాలి పర్యటన చేయనున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ పాల్గొన్నారు.
బాబు హయాంలో వ్యవస్థలన్ని భ్రష్టుపట్టించారని నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను కులమతాలు, పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా జగన్ ‘నేను విన్నాను-నేను ఉన్నాను’ అని ‘యాత్ర’ సినిమా డైలాగ్ చెప్పడంతో ఈ ప్రాంతం హర్షధ్వానాలతో మార్మోగింది.
నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమశంకర్ గణేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సత్యవతిని గెలిపించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో13 జిల్లాల్లోని ప్రజల కష్టాలు విన్నా. ప్రతి కుటుంబం పడుతున్న బాధను కళ్లారా చూశానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చేస్తానని.. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తామని హామీ ఇచ్చారు.
ఐదేళ్లలో ప్రతీ నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తా. అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మీ సమస్యలన్నీ నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఈ వేదిక నుంచి మాట ఇస్తున్నా’ అని జగన్ ప్రకటించారు.