బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని, మన జాతి వెన్నెముక కులాలు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బాబు బీసీలను ఓటుబ్యాంకుగానే చూశారని ధ్వజమెత్తారు.ఏలూరులో వైసీపీ నర్వహించిన బీసీ గర్జన సభలో జగన్ టీడీపీపై నిప్పులు చెరిగారు. బీసీల స్థితిగతులపై ఓ కమిటీ వేశామని, రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ బీసీల స్థితిగతులు తెలుసుకున్నారని, తన పాదయాత్ర ద్వారా బీసీల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానని అన్నారు.
భారతీయ నాగరికతలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉందని, ధరించే దుస్తులు నుంచి తినే ఆహారం వరకు, ఉపయోగించే పనిముట్టు, కట్టుకునే ఇల్లు..ఇలా ప్రతి ఒక్కటి నేర్పిన బీసీలకు రుణపడి ఉన్నామని అన్నారు. 2014లో బాబు చేసిన బీసీ డిక్లరేషన్కు ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. 2014 ఎన్నికలకు ముందు బీసీలకు చంద్రబాబు 119 వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. వాటిలో ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు.
వైఎస్ హయాంలో వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ను చంద్రబాబు నీరుగార్చారని, ముష్టివేసినట్టుగా రూ.30 వేలు రీయింబర్స్ మెంట్ కింద ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో, విద్యార్థుల తల్లిదండ్రులను అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో హామీలను నెరవేర్చనిబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి బీసీ డిక్లరేషన్ అంటున్నారని ఎద్దేవ చేశారు.