త్వరలో జరిగే ఎన్నికలు వైసీపీకి కీలకం కానున్నాయి. అధికార పార్టీ టీడీపీతో ఢీ అంటే ఢీ అంటోంది. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఆ పార్టీ మనుగడే కష్టం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇపుడు కీలకమైన మలుపులో ఉన్న ఫ్యాన్ పార్టీ అన్ని అస్త్రాలను సంధిస్తూ గెలుపు పిలుపు కోసం ఎదురుచూస్తోంది.
త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడంపై వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని తేల్చిచెప్పారు. జగన్ కోరితే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఏపీలో ప్రజలు ఇపుడు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని కూడా ఆమె అన్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభించిదని, వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఎపి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ అన్నారు. జగన్ పై దాడి విషయాన్ని అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఎన్నికల్లో వైసిపి ఏకైక ఎజెండా ప్రత్యేక హోదా అని, ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు .