వైసీపీ శ్రేణులకు ఇది చేదు వార్తే. జగన్ పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. విశాఖ ఎయిర్ పోర్టులో దాడికి గురైన వైసీపీ అధినేత జగన్ మళ్లీ తన పాదయాత్రను మరో సారి వాయిదా వేసుకున్నారు. గాయం తగ్గక పోవడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే పాదయాత్ర షెడ్యూల్ ఆలస్యం అవుతుండటంతో తిరిగి యాత్రలో పాల్గొనాలని జగన్ నిర్ణయించి.. 3వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని భావించారు. అయితే దాడి కారణంగా ఆయన భుజం కండరాలకు గాయం మానలేదు. దీంతో వైద్యులు జగన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.
ఈ క్రమంలోనే శనివారం నుంచి జరగాల్సిన పాదయాత్రను జగన్ వాయిదా వేసుకున్నారు. నవంబరు 10 నుంచి విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రను పున: ప్రారంభించనున్నారు జగన్. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. మరోవైపు దాడి తర్వాత తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు వస్తున్న జగన్కు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు విశాఖ విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే.
విజయనగరం జిల్లా సాలూరులో జగన్ పాదయాత్ర ఆగిపోయింది. మరో ఐదారు కిలోమీటర్లు నడిస్తే పార్వతీపురం నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. పార్వతీపురంలో తనపై జరిగిన దాడి గురించి జగన్ నోరు విప్పనున్నారు. చంద్రబాబు, మంత్రుల విమర్శలు, ఘటనపై జరుగుతున్న రాజకీయాలపై ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.