గుంటూరు జిల్లా చిలకలూరిపేట రాజకీయాల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు వైసీపీ నా యకురాలు విడదల రజనీ . ఎన్నారై మహిళగా ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అడుగు పట్టడంతోనే సంచ లనం సృష్టించారు. రాజకీయంగా తలపండిన టీడీపీ నాయకుడు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపైనే ఆమె పోరుకు సిద్ధమవుతున్నారు. అసలు రజనీ యేడాది కాలంగా వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. తొలుత టీడీపీలో చేరాలని అనుకున్నా.. అక్కడి పరిస్థితులు తనకు అనుకూ లంగా లేకపోవడంతో ఆమె వైసీపీ గూటికి చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఆమె టికెట్ను సైతం ఖరారు చేసుకున్నట్టు సమాచారం ఉంది. అయితే, ఆల్రెడీ పేటలో వైసీపీకి మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఉన్నారు.
గత ఎన్నికల్లో ఓటమిపాలైన మర్రి రాజశేఖర్ వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోతుండడంతో జగన్ సరైన ప్రత్యామ్నాయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలోనే జగన్కు లేడీ ఫైర్బ్రాండ్ రజనీ సరైన అభ్యర్థిగా సెట్ అయ్యారు. విడదల రజనీని జగన్ పార్టీలో చేర్చుకోవడంతో పాటు నియోజకవర్గ పగ్గాలు అప్పగించడంతో సమీకరణలు మారిపోయి.. మర్రి ఒకింత అలిగారు. ఈ పరిణామం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అందరూ అనుకున్నారు. మర్రి ఫ్యామిలీకి నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది. ఖచ్చితంగా ఈ సమయంలోనే విషయాన్ని గ్రహించిన రజనీ .. స్థానిక పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. మర్రి గౌరవానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా ముందుకు వెళుతున్నారు. ప్రతి విషయంలోనూ మర్రికి గౌరవం ఇస్తూనే ఆమె దూసుకు వెళుతూ నియోజకవర్గంలో ముందుగా పార్టీ అభిమానుల మనస్సులను గెలుచుకున్నారు.
దీనిలో భాగంగా ఇటీవల జరిగిన వైఎస్ వర్ధంతిని ఆమె తనకు అనుకూలంగా మలుచుకున్నారు. వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నిర్వహించిన భారీ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు, కేడర్ నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఇదే సమయంలో మర్రి రాజశేఖర్ రాజకీయ గురువు అయిన ఆయన మామ, దివంగత మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం ద్వారా తాను అందరి మనిషిని అని రజనీ నిరూపించుకున్నారు. ఈ ఒక్క సంఘటనతో ఆమె మర్రి అభిమానులను కూడా తన వైపునకు తిప్పుకున్నారు.
తనకు ఎలాంటి భేషజాలు లేవని, అందరి ఆశీస్సులు తనకు అవసరమని ఆమె నిరూపించారు. అనంతరం, అటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమస్వయకర్తలు, ఎంపీ అభ్యర్థులను కలుసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లాలోని పలువురు ప్రముఖ వైసీపీ టాప్ లీడర్లలో ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి వారి నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈ పరిణామం.. రజనీకి మేలు చేయనుందని అంటున్నా రు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు బిగుసుకుపోయిన నాయకులు ఈ పరిణామంతో రజనీకి జై కొట్టేందుకు రెడీ అవుతుండడం గమనార్హం.
ఇక నియోజకవర్గంలో నిన్నటి వరకు రజనీకి దూరంగా ఉన్న వైసీపీ, జగన్ వీరాభిమానులు సైతం ఆమె తీరును ప్రశంసిస్తూ ఆమెకు దగ్గరవుతున్నారు. మండల పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీలో ఇతర పదవుల్లో ఉన్న వారు రజనీని కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, సర్పంచ్లు ఇతర పదవుల్లో ఉన్న వారి మద్దతు రజనీకి రోజు రోజుకు క్రమక్రమంగా పెరుగుతోంది. సో.. మొత్తానికి రజనీని వ్యతిరేకిస్తున్న వారిని సైతం తన వినయంతో సుగుణంతో లౌక్యంతో రజనీ అందిరని దగ్గర చేసుకుంటుండడం గమనార్హం. రజనీ ఇదే దూకుడు, వ్యూహాలు ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తే ఆమె సక్సెస్ ఈజీ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.