మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సభా సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో సభలోనే తమను రౌడీలని, గూండాలని విమర్శించిన రోజులు ఇంకా గుర్తున్నాయన్నారు. కావాలంటే వాటి క్లిప్పింగ్స్ మళ్లీ వేసి చూపిస్తామని అన్నారు. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడలేక చంద్రబాబు నాయుడు పారిపోయారంటూ విమర్శించారు.
అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలపై చర్చ జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ దేశంలో ఏ అసెంబ్లీలో లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ అవకాశాలిస్తున్నారు.
రైతు సమస్యలగురించి బాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏనాడైనా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేస్తున్నారు. మళ్లీ వాళ్లే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ సంఖ్యను మూడుకు తగ్గించుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికే ఎంపీలు భాజాపాలోకి వెల్తున్నారని బాబు మారకుంటెఎమ్మెల్యేలు కూడా అదే దారిలో వెల్తారని సెటైర్లు వేశారు.