ఏపీ సీఎం చంద్రబాబపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో సారి నిప్పులు చెరిగారు. పుల్వామా దాడి ఘటనను దేశ వ్యాప్తంగా ఖండిస్తుంటే బాబు మాత్రం రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. పుల్వామా ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలనడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన పబ్లిసిటీ స్టంట్ వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారని మరి చంద్రబాబు రాజీనామా చేశారా అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు మీటింగ్ కోసం ఒక రైతును దారుణంగా కొట్టి చంపారని ఆరోపించారు.
వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని… వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్క నాయకుడు కూడా మిగలరని అన్నారు. బాబు విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నారన్నారు. వైసీపీలోకి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామాలు చేసి వస్తున్నారని అన్నారు.చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారంటూ రోజా ధ్వజమెత్తారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన ఘనత తమదే నన్నారు. ద్వంద్వ విధానాలు ఉన్న చంద్రబాబుకు తనకో నీతి.. మరొకరికి వేరే నీతి అన్నట్టుగా వ్యవహరించడం అలవాటేనని వ్యాఖ్యానించారు.