పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. దళితులపై వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్తకాదని గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న రోజా….ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రోజా నగరి నియోజకవర్గం విజయపురం మండలంలోని అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చింతమనేనిపై దళితులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
దళితులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం టీడీపీ నేతలకు అలవాటేనని…గతంలో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశారని ఆనాడు అతనిని అరెస్ట్ చెయ్యకుండా సీఎం చంద్రబాబు ఎమ్మార్వోనే ఇంటికి పంపించి సెటిల్మెంట్ చేయించారని ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. బాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.నంద్యాల ఉపఎన్నికల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితులను ఓటు బ్యాంకు గానే చూస్తుందే తప్ప వారి బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీలను మనుషుగులుగా గౌరవించాలి, ప్రేమించాలి, వారి సమస్యలను దూరం చేయాలనే ఆలోచన ఆ పార్టీలో ఎవరికీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం చింతమనేనిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.