ట్విట్టర్లో నారా లోకేష్, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకరి నొకరు ఏమాత్రం తగ్గడంలేదు. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్ ముదురుతోంది. జగన్ లక్ష్యంగా లోకేష్ ట్విట్టర్లో విమర్శలు చేస్తూ రెచ్చిపోతుంటే వాటికి కౌంటర్ ఇస్తూ విజయసాయిరెడ్డి కాకా రేపుతున్నారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ లపై విజయసాయిరెడ్డి ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. టీడీపీ మహిళా కార్యకర్త పద్మను వైసీపీవాళ్లు అవమానించడంతో ఆమె ప్రాణలు తీసుకుందని… ఈ హత్య శాపంగా మారి వైసీపీని పతనం చేస్తుందన్న వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయి… చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవని ఎద్దేవా చేశారు.
లోకేశ్ గురించి మాట్లాడుతూ, చంద్రబాబుగారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట… ఆకాశంపై ఉమ్మేయవద్దని సలహా ఇస్తున్నాడని విమర్శించారు. ‘మాది అందనంత స్థాయి’ అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా? అని ఎద్దేవా చేశారు.
లింగమనేని గెస్ట్హౌస్ను ల్యాండ్పూలింగ్లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారని, కానీ రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరునే ఉందన్నారు. తర్వాత దాని మరమత్తుల పేరిట రూ.8 కోట్లు ఖర్చుపెట్టారని, ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబే చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు.