ఏపీ పరిపాలన రాజధానిగా ఈనెల 27న రేపు కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయించబోతున్నారు. అధికారికంగా చేసే ఈ ప్రకటన తర్వాత 28న జగన్ విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు అపూర్వ స్వాగతం పలికేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం విశాఖలో కలెక్టర్, అధికారులు, మంత్రులు, నాయకులతో సమావేశమయ్యారు.
అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా చేసి ఇక్కడి ప్రజలకు గొప్ప బహుమతిని సీఎం జగన్ ఇచ్చారని.. 28న వస్తున్న జగన్ కు అపూర్వ స్వాగతం పలుకాలని పిలుపునిచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి నగరం వరకు మానవహారంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా విశాఖలో తనకు వివాదాస్పద ఆస్తులున్నట్టు వచ్చిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ఆస్తులపై తాను ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసి చెప్పలేదని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో తన పేరును వాడుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు సూచించారు. విశాఖలో తనకు ఒక్క ట్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ తప్ప ఏమీ లేదని. తన కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు. తన భాగస్వామ్యంలో కూడా ఎలాంటి వ్యాపారాలు లేవని క్లారిటీ ఇచ్చారు.
తాను విశాఖలోని భూముల వివాదాల్లో కూడా తలదూర్చడం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనకు ఆస్తులు పెంచుకోవాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ అధికారిని కూడా పనులు చేయాలని కోరలేదన్నారు. తన పేరు చెప్పి ఇక్కడ అధికారులను, వ్యవస్థలపై ఒత్తిడి తెస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను విజయసాయిరెడ్డి కోరారు.